మహబూబాబాద్, జ్వాల: పూర్వపు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ జాతీయ స్థాయి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు బుధవారం యశోద హాస్పిటల్ లో మరణించగా అంత్యక్రియల నిమిత్తం వారి స్వంత గ్రామం పెద్ద వంగర మండలం, వడ్డే కొత్తపల్లి గ్రామానికి తీసుకువచ్చారు. పాలకుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సుధాకర్ రావు పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుధాకర్ రావు మరణం ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర విషాదాన్ని నింపిందని, సుదీర్ఘ రాజకీయ నేపథ్య కుటుంబం కలిగిన సుధాకర్ రావు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకురావడంలో విశేష కృషి చేశారని,వృత్తిరీత్యా వైద్యుడైన సుధాకర్ రావు అనారోగ్యంతో మరణించడం బాధాకరమని కొనియాడారు. తనకు అత్యంత సన్నిహితుడైన సుధాకర్ రావు మరణాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జీర్ణించుకోలేక పోయారు. ఆయన పాడె మోసి కన్నీటి పర్యంతమయ్యారు. వడ్డేకొత్తపల్లి గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు చాలా మంది నాయకులు వచ్చి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సుధాకర్ రావు పార్థివ దేహానికి పూలమాల వేశారు. గ్రామ యువకులు మద్దెల స్వామి, రాజు, బీరన్న నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్యేకు ఘన నివాళి – ముగిసిన అంత్యక్రియలు
Leave a comment