-– బలమైన అభ్యర్థి కోసం పార్టీ వెతుకులాట
-– ఆశావహుల్లో మొదలైన టెన్షన్
–- పోటీపడుతున్న లోకల్.. నాన్ లోకల్ లీడర్లు
జ్వాల ప్రతినిధి, వరంగల్ :
వరంగల్ పార్లమెంట్ హస్తం టికెట్ పై ఉత్కంఠ ఇంకా వీడటం లేదు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ నుంచి పోటీచేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పేరును ప్రకటించగా, వరంగల్ స్థానం మాత్రం పెండింగ్లో పెట్టింది. కాగా, కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించకపోవటంతో వరంగల్ టికెట్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ అన్ని పార్టీల కేడర్లో నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కడియం కూతురు కావ్యకు కేటాయించిన నేపథ్యంలో ఆ పార్టీలో కొంత సస్పెన్షన్ వీడింది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అరూరి రమేశ్ బీజేపీ వైపు దాదాపు ఖాయమని తెలుస్తుంది. పార్టీలో చేరిన వెంటనే బీజేపీ టికెట్ ఇస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం తన క్యాండియేట్ ను పేరు ప్రకటించలేకపోతుంది. బలమైన అభ్యర్థులు లేకనా.. పోటీ ఎక్కువగా ఉందా అనే విషయాలు తేలడం లేదు. దీంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది.
వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం 42 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ 42మంది దరఖాస్తులను స్క్రూటీని చేసింది. వీరిలో స్టేషన్ ఘన్పూర్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిర, 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన దొమ్మాటి సాంబయ్యలతో పాటు పలువురి పేర్లతో అధిష్ఠానానికి స్క్రీనింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన ముగ్గురు జాబితాపై సర్వే ఏజెన్సీలతో సర్వే చేయించారు. ప్రస్తుతం ఈ ముగ్గురికంటే ఇంకా బలమైన అభ్యర్థి అయితే బాగుంటుందనే అభిప్రాయాలు ఏఐసీసీ నుంచి వచ్చినట్లుగా సమాచారం. అందుకే పెండింగ్ లో పెడుతున్నట్లు తెలుస్తుంది. సింగాపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్యలు ఇరువురు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం మినహా ఎక్కడా వీరికి ఫేమ్ లేదు. వీరికి టికెట్ ఇస్తే ఎలా అనే ఆలోచనలో అధిష్టానం పడింది.
బలమైన అభ్యర్థి కోసం ..
అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధి లోని ఏడు స్థానాల్లో ఆరు కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ కూడా బలంగా ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించింది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజక వర్గాల్లో బీజేపీకి ఓట్లు బాగానే వచ్చాయని కాంగ్రెస్ కు రిపోర్టులు వెళ్లాయి. దీంతో వరంగల్ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించకపోతే ప్రతి పక్షాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని కాంగ్రెస్ డిల్లీ పెద్దలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఒక దశలో దొమ్మాటి సాంబయ్యకు టికెట్ ఖరారైందనే ప్రచారం జరిగింది. అనుహ్యంగా తొలిజాబితాలో వరంగల్ ఎంపీ స్థానం అభ్యర్థి పేరు లేకపోవటంతో అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టిసారించిందనే మాటలు వినబడుతున్నాయి. పొలిటికల్ లీడర్లతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న హరి కోట్ల రవి సైతం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. శోభన్ కుమార్, సదానందం వంటి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే అధిష్టానం మాత్రం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఆలస్యం అవుతున్న కొద్ది ఆశావాహుల్లో టెన్షన్ పట్టుకుంది. బీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ లోని ఓ కీలకమైన నేత సంప్రదింపులు జనుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే చేరికపై ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అభ్యంతరాలు చెప్పుతున్నట్లుగా తెలిసింది.
అందరి ఆశలు వరంగల్ మీదనే..
లోకల్ లీడర్ల తో పాటు .. నాన్ లోకల్ లీడర్ల ఆశలు కూడా వరంగల్ పార్లమెంట్ మీదనే పడ్డాయి. 2016 వరంగల్ పార్లమెంట్ జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కూడా తనకు వరంగల్ సీటు కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా వరంగల్ పైనే నజర్ వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ కడియం కావ్యకు కేటాయించడంతో తీవ్ర నిరాశలో ఉన్న సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ వైపు తొంగిచూస్తున్నట్లు తెలుస్తుంది. రెండు సార్లు వరసగా భారీ మెజారిటీతో గెలిచిన ఉద్యమకారుడిగా తనకు గుర్తింపు ఉందని.. టికెట్ ఇస్తే జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వరంగల్ టికెట్ పై అనుహ్యంగా తీవ్ర పోటీ పెరుగుతుండటంతో అధిష్టానం తొలిజాబితాలో ప్రకటించలేదని సమాచారం. మొత్తానికి వరంగల్ కాంగ్రెస్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ కేడర్లో నెలకొంది.
టెన్షన్.. టెన్షన్
వరంగల్ ఎంపీ స్థానంలో పోటీచేసే అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రధానపార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించలేదు. ఇటీవలే బీఆర్ఎస్ మాత్రం కడియం కావ్యను ప్రకటించింది. బీజేపీ.. వరంగల్ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. దీంతో బీజేపీలో వరంగల్ టికెట్ ఎవరికి అనే ఉత్కంఠ నెలకొంది. కానీ ఈ రోజు అరూరి రమేశ్ చేరికపై పూర్తి క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ నుంచే వరంగల్ స్థానం నుంచి ఎవరు పోటీచేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వటం లేదు. దీంతో ఆశావాహుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికిప్పుడు పార్టీలు మారి వచ్చే నేతలైతే కనిపించడం లేదు. ఉన్న ఆశావాహుల కార్యకర్తలే ఆందోళనకు గురవుతున్నారు. టికెట్ ఎవరి పేరో ప్రకటిస్తే వర్క్ స్టార్ట్ చేసుకుంటామని.. షెడ్యూల్ టైమ్ కూడా దగ్గర పడుతుందని టెన్షన్ పడుతున్నారు. సడెన్ గా అనౌన్స్ చేస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన మొదలైంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించనంత వరకు క్యాడర్లో ఉత్కంఠ నెలకొని ఉంది.