హనుమకొండ, జ్వాల:
ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టిఎస్ ను టీజీగా మారుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శుక్రవారం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు అన్ని ఇకపై టీజీగా వస్తాయని ప్రకటించారు. హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు మనోభావాలను అణచివేసిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజి అని రాసుకున్నామని చెప్పారు. శాసనసభ ఆమోదంతో టిఎస్ ను టీజీగా మార్చాలని కేంద్రానికి పంపించగా దానికి ఆమోదం లభించిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా జీవోలను గోప్యంగా ఉంచాలనుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన జూన్ రెండవ తారీఖున గెజిట్లో టీజీ అని ఉందని, అయినా కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ గా మార్చిందని ఆయన ఆరోపించారు. ఏ ఉద్దేశంతో కేంద్రానికి నివేదించిందో వారికే తెలియాలి అన్నారు. తిరిగి టిఎస్ ను టీజీగా మార్చడానికి శాసనసభ తీర్మానం చేసి రాజ పత్రాన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక టీజీ అని, ఇది పార్టీ నిర్ణయం కాదు.. వ్యక్తిగత నిర్ణయాలు కావని వెల్లడించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని, గీతాన్ని మార్చడం సాహసోపేతమైన నిర్ణయం గా ఆయన అభివర్ణించారు. విఐపి ల కార్ల డ్రైవర్లకు కచ్చితంగా ఫిట్నెస్ పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే విషయంలో కఠిన నిబంధనలను తీసుకుంటామని వెల్లడించారు. అవినీతి ఎక్కడ ఉన్న ఉపేక్షించేది లేదని.. ఆర్టిఏ కార్యాలయాల్లో లంచాలు తీసుకుంటే ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆర్టీసీ కళకళలాడుతుందని అన్నారు. దశలవారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అన్నింటినీ భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించామని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఎలాంటి నష్టం జరగలేదని కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అని ఆయన కొట్టి పడేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ , డీటీసీ పుప్పాల శ్రీనివాస్ పాల్గొన్నారు.